పాస్ పోర్ట్ కు ఎలా దరఖాస్తు చేయాలి?



* దరఖాస్తు చేసుకునేదిలా... 
పాస్‌పోర్టు కావాలనుకునే వారు రెండు రకాలుగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవడం ఒకటయితే.. రెండోది ఈ-దరఖాస్తు డౌన్‌లోడ్‌ చేసుకొని కలంతో పూర్తి చేసి మళ్లీ దాన్ని అప్‌లోడ్‌ చేసి పంపించడం. ఇప్పుడు అధిక శాతం మంది ఆన్‌లైన్‌లోనే సమర్పిస్తున్నారు. ఇందుకు అధిక శాతం మంది ఇంటర్‌నెట్‌ కేంద్రాల నిర్వాహకులపై ఆధారపడతారు. వారు దరఖాస్తు పూర్తి చేసినందుకు కొంత రుసుం తీసుకుంటారు. అలా కాకుండా కంప్యూటర్‌పై కనీస పరిజ్ఞానం ఉంటే సొంతంగా దరఖాస్తు నింపి ఆన్‌లైన్‌లో పంపుకోవచ్చు.

* ఆన్‌లైన్‌లో దరఖాస్తు 
దరఖాస్తు చేసుకోవాలనుకునేవారు http://www.passportindia.gov.in/ లో లాగిన్‌ కావాలి. అందులోని హోం పేజీలో యూజర్‌ రిజిస్ట్రేషన్‌ వద్ద క్లిక్‌ చేసి అడిగిన సమాచారాన్ని నింపి సబ్మిట్‌ చేయాలి. కొత్తగా వచ్చే యూజర్‌ ఐడీతో కొత్త, రెన్యువల్‌ పాసుపోర్టుల్లో ఏదీ కావాలనుకుంటే ఆ దరఖాస్తును నింపాలి. అదే సమయంలో క్రెడిట్‌, డెబిట్‌ కార్డు, ఎస్‌బీఐ, దాని అనుబంధ బ్యాంకుల ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌ లేదా ఎస్‌బీఐ చలానా ద్వారా ఫీజు చెల్లించి అందుబాటులో ఉన్న తేదీల్లో అపాయింట్‌మెంట్‌ తీసుకోవాలి. తర్వాత పరిశీలనకు తాము ఎంచుకున్న పాసుపోర్టు సేవా కేంద్రం వద్దకు ఒరిజినల్‌ ధ్రువపత్రాలు, ఆన్‌లైన్‌ ఫారం సమర్పించేప్పుడు ప్రింట్‌ తీసిన రసీదుతో హాజరు కావాలి. పోలీసు పరిశీలన నివేదిక(పీవీఆర్‌) తర్వాత పోస్టులో పాసుపోర్టు అందుతుంది. సాధారణమైనదైతే దరఖాస్తు చేసిన నెల రోజుల్లోపే అందేందుకు వీలుంది. తత్కాల్‌ అయితే వారం రోజులలోపే జారీ చేస్తారు.


* సేవా కేంద్రాల్లోనే పరిశీలన 
పాసుపోర్టుకు దరఖాస్తు చేసిన వారే సేవా కేంద్రానికి వెళ్లాల్సి ఉంటుంది. ఒకరి తరఫున మరొకరు వెళ్లడానికి వీల్లేదు. దరఖాస్తుదారుడి వేలిముద్రలను తీసుకుంటారు. ఆన్‌లైన్‌ దరఖాస్తు సమర్పించిన తర్వాత మీరు ఎంచుకున్న తేదీ, సమయంలో అసలు ధ్రువపత్రాలు, దరఖాస్తు సమర్పించిన తర్వాత వచ్చే రసీదు తీసుకొని హాజరుకావాలి.
హైదరాబాద్‌ ప్రాంతీయ, విశాఖపట్నం పాసుపోర్టు కేంద్రాలు కేవలం పాసుపోర్టులను ముద్రించడం, దరఖాస్తుదారులకు పంపించడం చేస్తాయి. దరఖాస్తుదారుల సమస్యలను పరిష్కరిస్తాయి. అక్కడ మాత్రం దరఖాస్తుదారుల ధ్రువపత్రాల పరిశీలన జరగదు. పరిశీలన సేవా కేంద్రాల్లోనే చేస్తారు.

విశాఖపట్నానికి చెందిన వ్యక్తి హైదరాబాద్‌లో చదువుకుంటుంటే విశాఖపట్నంలోనే తీసుకోవాలన్న నిబంధన లేదు. కళాశాల యాజమాన్యం ఇచ్చే అఫిడవిట్‌తో ఇక్కడే దరఖాస్తు చేసుకోవచ్చు. శాశ్వత చిరునామా వైజాగ్‌ కనుక అక్కడైనా తీసుకోవచ్చు. కాకపోతే ప్రస్తుతం ఎక్కడ ఉంటుందనేది దరఖాస్తులో పేర్కొనాలి.

* ఎన్నో రకాల సేవలు... 
దరఖాస్తుదారుల ప్రయోజనార్థం ఎప్పటికప్పుడు అధికారులు వినూత్న సేవలను అందుబాటులోకి తీసుకువస్తున్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా వినియోగించుకుంటూ తక్కువ సమయంలో సేవలు అందించేందుకు కృషి చేస్తున్నారు. 

* దరఖాస్తుదారులకు సమస్య తలెత్తితే సికిందాబ్రాద్‌లోని ప్రాంతీయ పాసుపోర్టు కార్యాలయంలో సోమవారం నుంచి శుక్రవారం వరకు ఉ.9.30 గంటల నుంచి 11.30 మధ్యలో వచ్చి టోకెన్‌ తీసుకొని పరిష్కారం పొందవచ్చు.

* దరఖాస్తుల సమర్పణపై సందేహాలుంటే 17 భాషల్లో 24 గంటలపాటు పనిచేసే టోల్‌ ఫ్రీ నంబరు ఉంది. 18002581800కు ఫోన్‌ చేసి తెలుసుకోవచ్చు.

* దరఖాస్తుదారులు హైదరాబాద్‌ పాసుపోర్టు కార్యాలయ అధికారులను 040-27704646, ఫ్యాక్స్‌ నంబరు: 040-27705656 లో సంప్రదించవచ్చు.

* సికింద్రాబాద్‌ కార్యాలయంలో సహాయక కేంద్రం(హెల్ప్‌ డెస్క్‌) ఉంది. అక్కడ దరఖాస్తులను నింపడం, లేఖలు రాయడం, వివిధ విభాగాలను సంప్రదించడానికి సహాయం చేస్తారు.

* స్మార్ట్‌ ఫోన్‌ వినియోగదారులు మొబైల్‌ యాప్‌ mpassport seva ద్వారా పాసుపోర్టులకు సంబంధించిన చాలా వరకు సమాచారం తెలుసుకోవచ్చు.

* దరఖాస్తు చేసుకున్న తర్వాత పాసుపోర్టు సేవా కేంద్రం(పీఎస్‌కే)ల్లో రూ.30లు అదనంగా చెల్లిస్తే దరఖాస్తు స్థితిపై ఎస్‌ఎంస్‌లు అందుకోవచ్చు. తొమ్మిది సార్లు ఎస్‌ఎంఎస్‌లు వస్తాయి. దరఖాస్తుదారు ఎస్‌ఎంఎస్‌ పంపి తమ దరఖాస్తు, పాసుపోర్టు స్థితిని తెలుసుకోవచ్చు. అందుకు 9704100100 నంబరుకు సంక్షిప్త సందేశం పంపించాలి. అందుకు status space file no. ను పంపించాలి. ఉదాహరణకు status hy106771561714 అని ఎస్‌ఎంఎస్‌ పంపితే సమాధానం వస్తుంది.

>> ఇవి మీకు తెలుసా..? 
* పాసుపోర్టును పదేళ్ల వ్యవధికి ఇస్తారు. ఆ గడువు పూర్తయిన తర్వాత మళ్లీ పదేళ్ల కాలానికి రెన్యువల్‌ చేస్తారు.

* 18 సంవత్సరాల్లోపు వారిని మైనర్లుగా పరిగణిస్తారు. మైనర్లకు అయిదు సంవత్సరాల గడువు ఉన్నది ఇస్తారు.

* సాధారణ పాసుపోర్టు(నార్మల్‌) నీలం రంగు, డిప్లమాట్‌(జడ్జీలు, రాజ్యాంగ పదవుల్లో ఉండే సీఎం, ఎంపీలు తదితరులు) మెరూన్‌(రాణి రంగు), అఫీషియల్‌(అధికారిక పనులపై వెళ్లేవారికి) పాసుపోర్టు బూడిద రంగులో ఉంటుంది.

* అత్యధిక పాసుపోర్టు దరఖాస్తులు వస్తున్న రాష్ట్రాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ అయిదో స్థానంలో ఉండేది.

* అత్యధిక దరఖాస్తులు వస్తున్న పాసుపోర్టు కార్యాలయాల్లో దేశంలోనే హైదరాబాద్‌ది మొదటి స్థానం. ఆ తర్వాత లక్నో, బెంగళూరు, దిల్లీ, కోల్‌కతా ఉన్నాయి.



0 వ్యాఖ్యలు

Post a Comment

Thank You for your Comment